సినీ ప్రముఖలతో గంటా: విశాఖకు షిఫ్ట్? (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ విశాఖపట్నానికి తరలిపోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాస రావు సినీ ప్రముఖులతో అన్న మాటలు కూడా ఆ అనుమానాలకు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే, హైదరాబాదులో కొనసాగుతూనే విశాఖపట్నాన్ని కూడా తెలుగు సినీ ప్రముఖులు వాడుకుంటారా అనేది తెలియడం లేదు. అయితే, ముందు రాయితీల గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాతే విశాఖకు తరలిపోయే విషయం ఆలోచిద్దామనే పద్ధతిలో సినీ ప్రముఖుల ఆలోచన ఉంది.
ఫిల్మ్ కమిషన్ను ఏర్పాటు చేసి అంచెలంచెలుగా సినీ పరిశ్రమను విశాఖపట్నంలో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులతో ఆయన భేటీ అయ్యారు. ప్రముఖ దర్శకులైన బాలచందర్, విశ్వనాథ్, జంధ్యాల, కె.రాఘవేంద్రరావు లాంటి దర్శకులు విశాఖపట్నం ప్రాంతాలలో తమ చిత్రాలను కొంతమేరకైనా చిత్రీకరించేవారని ఆయన అన్నారు.
తొలుత కొంత మంది సినీ ప్రముఖులతో కమిటీ ఏర్పాటు చేస్తామని, విశాఖపట్నం సమీపంలో షూటింగ్ చేసే ప్రాంతాలను ఆ కమిటీ గుర్తిస్తుందన్నారు. అనంతరం షూటింగ్ నిర్వహించుకొనేవారు ఆ కమిటీని సంప్రదిస్తే వాటికి సంబంధించిన గైడెన్స్ ఇస్తారని తెలిపారు. సినీ ప్రముఖులతో ఇది తొలి సమావేశమని, తర్వాత, పరిశ్రమలలోని దిగ్గజాలు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో చర్చలు జరిపి దీనిపై ప్రత్యేక ప్రణాళికను తయారుజేసి సీఎంకి అందజేస్తామన్నారు.
స్డూడియోలకు ప్రదేశాలు
విశాఖలో స్టూడియోలు నిర్మించుకునేందుకు అనువైన ప్రదేశాలు ఉన్నాయని మంత్రి గంటా శ్రీనివాస రావు చెప్పారు.
సంక్షోభంలో సినిమా
పరిశ్రమ ప్రస్తుతం సంక్షోభంలో ఉందని సినీ ప్రముఖులు అన్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో షూటింగ్లు నిర్వహించే సమయంలో పోలీసులు, అక్కడి అధికారులతో ఇబ్బందులు ఎన్నో ఎదురవుతున్నాయని వారు మంత్రి దృష్టికి తెచ్చారు.
సమస్యలు పరిష్కరిస్తే..
క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తొలగిస్తే అక్కడ షూటింగ్ జరిపేందుకు సిద్ధమేనని చెప్పారు. గోవా, చెన్నైల మాదిరే వైజాగ్లోనూ ఫిల్మ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయాలని వారు కోరారు.
విశాఖలో నంది అవార్డులు...
ఈ ఏడాది నంది అవార్డుల ప్రదానోత్సవాన్ని విశాఖలో నిర్వహించాలని సినీ ప్రముఖులు సూచించారు. యేటా ఈ ఉత్సవం హైదరాబాదులో జరుగుతోంది.
విశాఖలో కార్పోరేషన్
విశాఖపట్నంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని, సింగిల్ విండో పద్ధతిలో రోడ్లు, ప్రభుత్వ పార్కులు, అతిథి గృహాల ప్రాంతాల్లో షూటింగ్ చేసే సమయంలో పన్నులు తక్కు వ విధించాలని, సబ్సిడీలు ఇవ్వాలని సినీ ప్రముఖులు సూచించారు.
ప్యాకేజీకి వినతి
తెలుగులో 80 శాతం చిన్న సినిమాలు రూపొందుతున్నాయని, వాటిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని సినీ ప్రముఖులు మంత్రిని కోరారు.
ప్రభుత్వం సుముఖం
రాయితీలు ఇచ్చే విషయంపై తమ ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి గంటా శ్రీనివాస రావు సనీ ప్రముఖులకు హామీ ఇచ్చారు.
స్టూడియోలకు వినతి
విశాఖలో స్టూడియోలు పెట్టేందుకు ఇప్పటికే దర్శకుడు కృష్ణవంశీ, సత్యానంద్ వంటి ప్రముఖులు అడిగారని మంత్రి చెప్పారు.
భేటీలో వీరు..
మంత్రులతో జరిగిన భేటీలో సినీ ప్రముఖులు పరుచూరి గోపాలకృష్ణ, నిర్మాత దగ్గుబాటి సురేష్బాబు, దర్శకుడు తేజ, కవిత, సురేష్, అశోక్ కుమార్ పాల్గొన్నారు.