సీమాంధ్రలో సైకిల్ జోరు, తెలంగాణలో హస్తం హవా
సీమాంధ్రలోని ఏడు కార్పోరేషన్లలో టిడిపి ఐదు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గెలుచుకున్నాయి. విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, అనంతపురం, చిత్తూరు కార్పోరేషిన్లను టిడిపి గెలుచుకోగా, కడప, నెల్లూరు కార్పోరేషన్లను వైయస్సార్ కాంగ్రెసు గెలుచకుంది.
తెలంగాణలోని మూడు కార్పోరేషన్లలో కాంగ్రెసు, తెరాస చెరోటి గెలుచుకున్నాయి. కాంగ్రెసు నిజామాబాద్ కార్పోరేషన్ను గెలుచుకోగా, తెరాస కరీంనగర్ కార్పోరేషన్ను గెలుచుకుంది. రామగుండం కార్పోరేషన్ హంగ్ అయింది.
రంగారెడ్డి జిల్లాలో రెండు మున్సిపాలిటీలను టిడిపి, మరో రెండు మున్సిపాలిటీలను కాంగ్రెసు గెలుచుకున్నాయి. ఒకటి హంగ్ ఏర్పడింది.
శ్రీకాకుళం జిల్లాలో వైకాపా, టిడిపి రెండేసి మున్సిపాలిటీలను దక్కించుకున్నాయి
తూర్పుగోదావరి జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు టిడిపికి దక్కాయి. ఏడింట హంగ్ వచ్చింది.
విశాఖపట్నం జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో టిడిపి విజయం సాధించింది. నెల్లూరు జిల్లాలో రెండు టిడిపికి, ఒక్కటి వైసిపికి దక్కాయి. మూడింట హంగ్ వచ్చింది.
విజయవాడ కార్పోరేషన్ టిడిపి ఖాతాలో చేరింది. గుంటూరు జిల్లాలో 11 మున్సిపాలిటీలు టిడిపికి దక్కగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఒక్క మున్సిపాలిటీలోనే విజయం సాధించింది.
ప్రకాశం జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో నాలుగు, వైసిపి రెండు మున్సిపాలిటీల్లో విజయం సాధించింది.
సీమాంద్రలోని 92 మున్సిపాలిటీల్లో టిడిపి 64, వైయస్సార్ కాంగ్రెసు 19 మున్సిపాలిటీలు దక్కాయి. 9 హంగ్ ఏర్పడ్డాయి. కాంగ్రెసు ఖాతా తెరవలేదు. తెలంగాణలోని 53 మున్సిపాలిటీల్లో కాంగ్రెసుకు 23, తెరాసకు 9 దక్కాయి. 6 టిడిపికి దక్కాయి. బిజెపికి రెండు, మజ్లీస్కు ఒక మున్సిపాలిటీలు వచ్చాయి.
కృష్ణా జిల్లాలోని గుడివాడలో వైయస్సార్ కాంగ్రెసు విజయం సాధించింది. మచిలీపట్నం మాత్రం టిడిపికి దక్కింది.
తూర్పు గోదావరి జిల్లాలో 7 మున్సిపాలిటీలు టిడిపికి వచ్చాయి. మూడింటిలో హంగ్ ఏర్పడింది.
వైయస్ జగన్ సొంత జిల్లా కడపలోని ఏడు మున్సిపాలిటీల్లో నాలుగు టిడిపి కైవసం కాగా, వైయస్సార్ కాంగ్రెసుకు మూడు మాత్రమే దక్కాయి.
ప్రకాశం జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు టిడిపికి, రెండు వైయస్సార్ కాంగ్రెసుకు దక్కాయి
నెల్లూరు జిల్లాలో మూడు టిడిపికి, ఒక్కటి వైకాపాకు దక్కగా, మూడు హంగ్ వచ్చాయి.
అనంతపురం జిల్లాలోని 11 మున్సిపాలిటీలను కూడా టిడిపి దక్కించుకుంది. ఇతర పార్టీలకు ఒక్కటి కూడా దక్కలేదు.
సీమాంధ్రలో అత్యధిక మున్సిపాలిటీలను, కార్పోరేషన్లను సాధించడంతో తెలుగదేశం పార్టీ కార్యాలయంలో సంబరాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు.
చిత్తూరు, రాజమండ్రి కార్పోరేషన్లలో టిడిపి విజయం సాధించింది.
నిజామాబాద్ కార్పోరేషన్లో కాంగ్రెసు 8, మజ్లీస్ ఎనిమిది డివిజన్లలో విజయం సాధించాయి.
కడప, నెల్లూరు కార్పోరేషన్లలో వైయస్సార్ కాంగ్రెసు ఆధిక్యంలో ఉంది. అనంతపురం, రాజమండ్రి, చిత్తూరు, ఏలూరు, విజయవాడ కార్పోరేషన్లలో టిడిపి ఆధిక్యంలో ఉంది.
కడప కార్పోరేషన్ వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు ఖాతాలో చేరింది.
సీమాంధ్రలో 43 మున్సిపాలిటీల్లో టిడిపి, 14 మున్సిపాలిటీల్లో వైయస్సార్ కాంగ్రెసు విజయం సాధించింది.
కృష్ణా తిరువూరు మున్సిపాలిటీలో టిడిపి విజయం సాధించింది.
ఎర్రగుంట్ల, రాయచోటి, పులివెందుల మున్సిపాలిటీల్లో వైయస్సారా కాంగ్రెసు పార్టీ విజయం సాధించింది.
అనంతపురం జిల్లా పుట్టపర్తి, కృష్ణా జిల్లా నందిగామల్లో టిడిపి అధిక వార్డులు గెలుచుకుంది.
సీమాంధ్రలో టిడిపి 36 మున్సిపాలిటీల్లో, వైయస్సార్ కాంగ్రెసు పది మున్సిపాలిటీల్లో ఆధిక్యం సాధించాయి.
తెలంగాణలో 23 మున్సిపాలిటీల్లో కాంగ్రెసు, 11 మున్సిపాలిటీల్లో తెరాస, టిడిపి 4 మున్సిపాలిటీల్లో విజయం సాధించాయి. బిజెపి రెండు మున్సిపాలిటీలను గెలుచుకుంది. వేములవాడతో పాటు నారాయణ్ఖేడ్ మున్సిపాలిటీని కూడా బిజెపి దక్కించుకుంది. టిడిపికి నాలుగు మున్సిపాలిటీలు దక్కాయి. బిఎస్పీ కూడా ఒక్క మున్సిపాలిటీలో పాగా వేయడం విశేషం
గజ్వెల్లో పది వార్డులను టిడిపి గెలుచుకోగా, తెరాస 9, కాంగ్రెసు ఒక వార్డులను గెలుచుకున్నాయి. దీంతో ఎక్స్అఫియో సభ్యుడి ఓటుపై మున్సిపల్ చైర్మన్ పదవి ఏ పార్టీ దక్కించుకుంటుందనే విషయం ఆధారపడి ఉంటుంది. గజ్వెల్ శాసనసభా స్థానం నుంచి తెరాస అధినేత కెసిఆర్ పోటీ చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణలోని రామగుండం కార్పోరేషన్ను కాంగ్రెసు గెలుచకుంది. మెదక్ జిల్లా గజ్వెల్లో టిడిపి విజయం సాధించింది.
సీమాంధ్రలో టిడిపి 30 మున్సిపాలిటీల్లో, వైసిపి 6 మున్సిపాలిటీల్లో విజయం సాధించింది.
తెలంగాణలో కాంగ్రెసు 8, తెరాస 7, టిడిపి 3 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నాయి.
సత్తుపల్లి మున్సిపాలిటీని టిడిపి కైవసం చేసుకుంది. పెడన హంగ్ అయింది. రాజమండ్రి కార్పోరేషన్లో టిడిపి సైకిల్ దూసుకుపోతోంది. నెల్లురు జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది.
మున్సిపాలిటీ ఫలితాల్లో తెలంగాణలో కాంగ్రెసుపై తెరాస ఆధిక్యం సాధిస్తుండగా, సీమాంధ్రలో సైకిల్ జోరు మీదు ఉంది. సీమాంధ్రలో కాంగ్రెసు ఖాతా తెరవలేదు.
ప్రకాశం జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో టిడిపికి ఆరు, వైయస్సార్ కాంగ్రెసు రెెండు దక్కాయి.
బెల్లింపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెసు విజయం సాధించింది. దేవరకొండ మున్సిపాలిటీ కూడా కాంగ్రెసు వశమైంది. వేములవాడ మున్సిపాలిటీని బిజెపి దక్కించుకుంది.
సీమాంధ్రలో ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో టిడిపి 6 మున్సిపాలిటీలను కైవసం చేసుకోగా, వైయస్సార్ కాంగ్రెసుకు రెండు దక్కాయి. పాలకొండ మున్సిపాలిటీలో టిడిపి విజయం సాధించింది. పార్వతీపురం టిడిపికి దక్కింది.
తెలంగాణలో ఆరు మున్సిపాలిటీల్లో తెరాస విజయం సాధించింది. కాంగ్రెసు నాలుగు, టిడిపి రెండు మున్సిపాలిటీలను గెలుచుకున్నాయి.
కరీంనగర్ జిల్లా వేములవాడలో బిజెపి విజయం సాధించింది. రేపల్లెలో టిడిపి సత్తా చాటింది.
హుజురాబాద్ మున్సిపాలిటీని తెరాస దక్కించుకుంది. పెద్దాపురం మున్సిపాలిటీ టిడిపి కైవసమైంది.
మడకశిరలో ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డికి షాక్ తగిలింది. అక్కడ తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది.
అదిలాబాద్ జిల్లా భైంసా మున్సిపాలిటీలో మజ్లీస్ విజయం సాధిచింది. తెలంగాణలోని జనగాం, నర్సంపేట మున్సిపాలిటీల్లో అధిక స్థానాలను కాంగ్రెసు దక్కించుకుంది.
రామచంద్రపురం మున్సిపాలిటీలో తెలుగుదేశం అత్యధిక స్థానాలు గెలుచుకుంది, అయితే చైర్మన్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఆళ్లగడ్డ, గిద్దలూరు వైయస్సార్ కాంగ్రెసు వశమయ్యాయి.
ఆందోల్ మున్సిపాలిటీ కాంగ్రెసు కైవసం చేసుకుంది. అముదాలవలస, తుని మున్సిపాలిటీలు వైసిపి చేజిక్కాయి. కరీంనగర్ కార్పోరేషన్ను తెరాస దక్కించుకుంది.
చిలకలూరిపేట మున్సిపాలిటీలో అత్యధిక వార్డులను వైయస్సార్ కాంగ్రెసు గెలుచుకుంది. భైంసా మున్సిపాలిటీలో మజ్లీస్ ఆధిక్యం కొనసాగిస్తోంది.
సీమాంధ్రలో ఏడు మున్సిపాలిటీల్లో తెలుగుదేశం పార్టీ పాగా వేసింది. అమలాపురం మున్సిపాలిటీలో టిడిపి హవా కొనసాగించింది. అత్యధిక వార్డులను గెలుచుకుంది. అద్దంకి, ముమ్మిడివరం, కనిగిరి, మండపేట మున్సిపాలిటీల్లో టిడిపి గాలి వీచింది. చీమకుర్తి, యలమించిలి కూడా టిడిపి కైవసం చేసుకున్నట్లు వార్తలు అందుతున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధిక స్థానాలను కైవసం చేసుకుంది.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పురపాలక సంఘాల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. రాష్ట్రంలోని 145 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఈ 155 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేసింది.
కౌంటింగ్ కేంద్రాలవద్ద 144 సెక్షన్ విధించారు. మున్సిపల్ ఫలితాలు వెల్లడి సందర్భంగా మద్యం దుకాణాలు మూసివేయాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. మున్సిపాలిటీలు, నగరపంచాయతీల్లో 39 చోట్ల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని రమాకాంత్రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో 65 ప్రాంతాల్లో 155 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మున్సిపాలిటీల్లో రెండు రౌండ్ల లెక్కింపు జరుగుతుంది. నగరపాలక సంస్థల్లో నాలుగు రౌండ్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఏజెంట్లను లెక్కింపు కేంద్రాల వద్దకు అనుమతించడం లేదు. దీంతో ఓట్ల లెక్కింపు సందర్భంగా గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో ఏజెంట్లు, పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది.