దోస్తీ కటీఫ్: బిజెపి, టిడిపి మధ్య చర్చలు విఫలం
హైదరాబాద్: బిజెపితో తెగదెంపులు చేసుకోవడానికే తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. విజయనగరం జిల్లా గజపతినగరం బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరోక్షంగా అదే చెప్పారు. తెలంగాణలో పొత్తు కుదిరింది గానీ సీమాంధ్రలో కుదరలేదనే పద్ధతిలో మాట్లాడారు. బిజెపి బలహీనమైన అభ్యర్థులను పెడుతోందని, అది చూస్తే తనకు భయమేస్తోందని, ప్రత్యర్థులకు ఉపయోగపడే పరిస్థితి ఉందని ఆయన అన్నారు.
అయితే, పొత్తు సవ్యంగానే ఉందంటూ బిజెపి నేత ప్రకాష్ జవదేకర్ ఇక్కడ హైదరాబాదులో చెప్పారు. టిడిపి పొత్తును తెంచుకోవడానికి సిద్ధపడిందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన గురునారంనాడు హైదరాబాదు వచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి ఇరు పార్టీల నేతల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఒంటరిపోరుకే సిద్ధంకావాలని టీడీపీ దాదాపుగా ఓ నిర్ణయానికి వచ్చింది.
తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు సుజనా చౌదరి, జవదేకర్ గురువారం సాయంత్రం సుదీర్ఘ చర్చలు జరిపారు. బిజెపి అభ్యర్థులు బలహీనంగా ఉన్న స్థానాలను తమకు ఇచ్చేయాలని సుజనా చౌదరి కోరారు. అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు బలహీనంగా ఉంటే దాని ప్రభావం లోకసభ సీట్లపై కూడా పడుతుందని సుజనా చౌదరి అన్నారు.
పొత్తుల్లో భాగంగా కేటాయించిన 14లో 7 స్థానాలు అసెంబ్లీ సీట్లు తమకు తిరిగి ఇవ్వాలని సుజనా చౌదరి బిజెపి నేతలను కోరారు. కానీ, బిజెపి నేతలు దీనికి అంగీకరించలేదు. ఏవైనా రెండు సీట్లు మాత్రం వెనక్కి ఇవ్వగలమని జవదేకర్ చెప్పారు. రెండు సీట్లతో సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి లేదని, అనేక జిల్లాల్లో సమస్య తీవ్రంగా ఉన్నందువల్ల ఏడు సీట్లు ఇస్తేనే సర్దుబాటు చేసుకోగలమని తెలుగుదేశం నేతలు చెప్పారు.
వాటిని వెనక్కు ఇవ్వడానికి ఇబ్బంది అయితే ఆ సీట్లలో స్నేహపూర్వక పోటీలకు దిగుదామని ప్రతిపాదించారు. ఈ అంశాలపై అర్ధరాత్రి వరకూ చర్చలు సాగినా ఫలితం రాలేదు. దీంతో చర్చలు విఫలమైనట్లేనని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ప్రకాష్ జవదేకర్ శుక్రవారం చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశం ఉంది.