రాజీనామాకు సిద్ధపడ్డా, బాధాకరమే: గోద్రా అల్లర్లపై మోడీ
న్యూఢిల్లీ: గోద్రా అల్లర్ల పైన గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి పెదవి విప్పారట. గుజరాత్లో 2002లో జరిగిన మత ఘర్షణలు బాధాకరమే కానీ తాను దోషిని కాదని, లేశప్రాయంగా కూడా ఏ కోర్టూ దాన్ని నిర్ధారించలేదని మోడీ వ్యాఖ్యానించారట.
అల్లర్లు జరిగినప్పటి నుండి పన్నెండేళ్ల పాటు తాను అన్ని వైపుల నుండి విమర్శలను ఎదుర్కొన్నానని, అయితే మీడియా తన పని తాను చేసుకోనివ్వాలని, ఎలాంటి ఘర్షణ పెట్టుకోకూడదని తాను ముందే నిర్ణయించుకున్నానని చెప్పారు. ఘర్షణతో తాను ఎప్పుడూ సమయాన్ని వృధా చేసుకోలేదని మోడీ చెప్పినట్టు బ్రిటీష్ రచయిత, టివి వ్యాఖ్యాత ఆండీ మారినో రాసిన ఆయన జీవిత చరిత్ర పేర్కొంది.
ఈ పుస్తకం ఈ మధ్యనే మార్కెట్లో విడుదలైంది. ‘నరేంద్ర మోడీ: ఎ పొలిటికల్ బయోగ్రఫీ' అనే పుస్తకాన్ని హార్పర్ కాలిన్స్ సంస్థ ప్రచురించింది. మోడీ తనకు చాలా దగ్గరినుంచి అవకాశం కల్పించారని, ఆయన ప్రచార ర్యాలీల సమయంలో హెలికాప్టర్లో ఆయన వెంట ఉండి వారాల తరబడి ఆయనను ఇంటర్వ్యూ చేశానని మారినో ఈ పుస్తకంలో తెలిపారు.
310 పేజీలున్న పుస్తకంలో అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడా ప్రచురితం కాని, అధికారిక డాక్యుమెంట్లతో కూడిన కొన్ని వివరాలున్నాయి. అల్లర్ల తర్వాత మోడీ ముఖ్యమంత్రి పదవినుంచి తప్పుకోవాలని అనుకున్నారని, అయితే పార్టీ, గుజరాత్ ప్రజలు ఒత్తిడి చేయడంతో పదవిలో కొనసాగినట్టు పుస్తకం వెల్లడించింది.
అల్లర్ల తర్వాత తాను ఎంత మాత్రం ముఖ్యమంత్రిగా ఉండరాదని, ఎందుకంటే తన కారణంగా రాష్ట్ర ప్రజలు విమర్శలను ఎదుర్కోవడం భావ్యం కాదని మోడీ తనతో చెప్పారని ఒక రికార్డ్ చేసిన ఇంటర్వ్యూలో మోడీ ఈ విషయం చెప్పడం బహుశా ఇదే మొదటిసారని మారినో అంటున్నారు.
గోద్రా అల్లర్ల తర్వాత రాజీనామాకు పార్టీ అంగీకరించలేదని, ఆ ఘటన తర్వాత శాంతిస్థాపనకు కృషి చేశానని చెప్పారు. పొరుగు రాష్ట్రాల సాయం కోరాననన్నారు. తన విజ్ఞప్తికి మహారాష్ట్ర సిఎం విలాస్ రావు దేశ్ముఖ్ మాత్రమే స్పందించారని, మహారాష్ట్ర సిఎం దిగ్విజయ్ సింగ్, రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్ నిరాకరించారన్నారు.