మోడీ పోస్టర్ చించి తమవి: కాంగ్రెస్ వడోదరఅభ్యర్థి అరెస్ట్
అహ్మదాబాద్: భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పైన వదోదరలో పోటీ చేస్తున్న కాంగ్రెసు పార్టీ అభ్యర్థి మధుసూదన్ మిస్త్రీని, అతని అనుచరులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. మోడీ పోస్టర్లను తొలగించి ఆ స్థానంలో తమ పోస్టర్లను అతికించే ప్రయత్నం చేయడంతో ఉదయం ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.
వడోదరలోని ప్రధాన కేంద్రాల్లో ఉన్న ప్రకటనల బోర్డులన్నింటిని భారతీయ జనతా పార్టీ నెల రోజుల క్రితమే బుక్ చేసుకుంది. దాదాపు వెయ్యి హోర్డింగులను ఏర్పాటు చేసింది. దాంతో కాంగ్రెసు అభ్యర్థికి హోర్డింగులకు స్థలం దొరకలేదు.
తనకు ప్రచారం చేసుకోవడానికి బిజెపితో సమానంగా స్థలం కావాలని మధుసూదన్ మిస్త్రీ మున్సిపల్ అధికారులను కోరారు. అయితే వారు వీలుకాదని చెప్పారు. దీంతో జిల్లా అధికారులు, పోలీసులు తమ పట్ల వివక్ష చూపుతున్నారని మధుసూదన్ మిస్త్రీ ఆరోపించారు.
అంతేకాదు కొన్ని చోట్ల మోడీ పోస్టర్లు ఉన్న చోట.. వాటిని చించివేసి, వాటి స్థానంలో తమ పోస్టర్లు అతికించే ప్రయత్నం చేశారు. దీంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, రాష్ట్రంలోని అధికార గణం ముఖ్యమంత్రికి అనుకూలంగా పని చేస్తోందని మిస్త్రీ మండిపడ్డారు.
మరో కాంగ్రెసు నాయకుడు మాట్లాడుతూ... పట్టణమంతా మోడీ పోస్టర్లతో నిండి ఉందని, తమకు ప్రచారం చేసుకునేందుకు స్థలం లేకుండా పోయిందని, అందుకే మోడీ పోస్టర్లను తొలగించామని చెప్పారు. బిజెపికి ఓటమి భయముందని ఎద్దేవా చేశారు. అందుకే తమకు అవకాశం ఇవ్వడం లేదన్నారు. ఓటమి భయంతోనే మోడీ వడోదర, వారణాసి.. ఇలా రెండు స్థానాల నుండి పోటీ చేస్తున్నారన్నారు.
తమకు స్థలం ఇవ్వలేదన్న కాంగ్రెసు నేతలకు గుజరాత్ బిజెపి అధికార ప్రతినిధి జయనారయణ్ వ్యాస్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెసు పార్టీకి చోటు ఇవ్వడం బిజెపి డ్యూటీయా అని ప్రశ్నించారు. ప్రచారం కోసం వారికి చోటు లేదంటే వారికి.. ప్రజల హృదయాలలోను చోటులేదనే విషయాన్ని గుర్తించాలని ఎద్దేవా చేశారు.