బాబు దెబ్బ: కిషన్రెడ్డి మాట వింటే.., వెనుక టిడిపి లెక్క
టిడిపితో పొత్తు వద్దని కిషన్ రెడ్డి మొదటి నుండి అధిష్టానం వద్ద చెబుతున్నారు. కానీ, ఆయన మాటలను కాదని అధిష్టానం పొత్తుకు సిద్ధపడింది. టిడిపి, బిజెపి పొత్తు వెనుక ప్రధానంగా ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఉన్నారనే వాదనలు ఉన్నాయి. ఈ కారణంగానే కిషన్, వెంకయ్యల మధ్య తీవ్ర విభేదాలు కూడా వచ్చినట్లు ప్రచారం జరిగింది. టిడిపితో పొత్తు వద్దని కిషన్ రెడ్డి చెప్పడం వెనుక పలు కారణాలు ఉన్నాయని అంటున్నారు.
బిజెపి తొలి నుండి తెలంగాణ కోసం ఉద్యమంలో పాల్గొందని, అదే సమయంలో టిడిపి రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రవచించిందని, ఆ పార్టీతో వెళ్తే పార్టీకి నష్టమని కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ ప్రాంత నేతలు భావించి, అదే విషయాన్ని అధిష్టానానికి చెప్పారు. అంతేకాకుండా.. టిడిపితో పొత్తు కారణంగానే గతంలో బిజెపి రాష్ట్రంలో ఎదగలేకపోయిందనే భావన బిజెపి నాయకులలో ఉంది. టిడిపి వైఖరి పైన తెలంగాణ బిజెపి నేతలు అనుమానం వ్యక్తం చేశారట. అయినప్పటికీ అధిష్టానం టిడిపితో పొత్తుకు సిద్ధపడింది.
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పని దాదాపు అయిపోయిందన్న వాదన ఉంది. తెలంగాణలో నామినేషన్ల పర్వం పూర్తయింది. అదే సమయంలో సీమాంధ్రలో నామినేషన్ల గడువు రేపటితో ముగియనుంది. ఈ సమయంలో... తెలంగాణకు మద్దతిచ్చినందున బిజెపితో వెళ్తే తమను నమ్మరని పలువురు టిడిపి నేతలు చంద్రబాబుకు సూచించారని, కటీఫ్ వెనుక ఇదీ కూడా ఓ కారణం కావొచ్చునని అంటున్నారు.
తెలంగాణలో గట్టెక్కిన టిడిపి.. ఇప్పుడు సీమాంధ్రలో బిజెపితో కలిసి వెళ్లేందుకు నో చెబుతోందని అంటున్నారు. బిజెపితో సీమాంధ్రలో కలిసి వెళ్లేందుకు నిరాకరించడానికి... బలహీనమైన అభ్యర్థులు, తెలంగాణకు మద్దతిచ్చిన బిజెపితో కలిసి వెళితే నష్టమని, అలాగే మైనార్టీలు దూరం అవుతారనే ఆలోచన టిడిపిలో ఉండవచ్చునని అంటున్నారు. పలు కారణాలు ఉన్నప్పటికీ బలహీనమైన అభ్యర్థులు అనే దానిని హైలట్ చేస్తుండవచ్చునని చెబుతున్నారు.