వేరు చేస్తారని రోడ్డుపైనే ప్రేయసికి తాళి కట్టిన ప్రియుడు
చెన్నై: తన ప్రేయసిని ఆమె బంధువులు ఎక్కడ వేరు చేస్తారమోనని ఆందోళన చెందిన ఓ యువకుడు ఆమెకు రోడ్డుపైనే తాళి కట్టి ఆమెను తన భాగస్వామిని చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తంజావురులో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఊటీకి చెందిన దివ్య, ఆనంద్ అనే ఇద్దరు యువతీ యువకులు అదే ప్రాంతంలోని ఓ ప్రైవేటు కాలేజీలో చదువుతున్నారు.
ఈ క్రమంలో వారి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. వీరి ప్రేమ వ్యవహారం దివ్య తల్లిదండ్రులకు తెలియడంతో ఆమెను వారు మందలించారు. అయినా ఆమె తల్లిదండ్రుల మాట వినకుండా ఆనంద్ను తరచూ కలుసుకునేది. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు ఆమెను తంజావూరులోని బంధువుల ఇంటికి పంపించారు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న ఆనంద్ కూడా తంజావూరు వెళ్లాడు. దివ్య ఉంటున్న ఇంటికి వెళ్లిన ఆనంద్.. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమెను వెంట తీసుకుని బస్టాండుకు బయల్దేరాడు. ఇంట్లో దివ్య కనిపించకపోవడం ఆమె బంధువులు వెదుకులాట ప్రారంభించారు.
దివ్య బంధువులు వస్తుండటాన్ని గమనించిన ఆనంద్.. ఎక్కడ ఆమెను తీసుకెళ్తారనే ఆందోళనతో ఆమెకు రోడ్డుపైనే తాళి కట్టాడు. కాగా, అక్కడే వున్న పోలీసులు ఆ ప్రేమ జంటను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళారు. వారిద్దరూ మేజర్లు కావడంతో ఆమె బంధువులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేశారు.