చేతకాకుంటే.. లంచాన్ని చట్టబద్దం చేయాలన్న ఎమ్మెల్యే
న్యూఢిల్లీ: బీహార్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే ఒకరు లంచాన్ని చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేస్తున్నారు! జేడీయు సీనియర్ నేత, అయిన రాజీవ్ రంజన్ అనే సీనియర్ ఎమ్మెల్యే ఈ డిమాండ్ చేస్తున్నారు. బీహార్లో విపరీతంగా పెరిగిపోతున్న అవినీతిపై అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన ఇతను ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
బీహార్లో అవినీతిని కంట్రోల్ చేయడం ప్రభుత్వానికి చేతకాకపోతే, వెంటనే లంచం తీసుకోవడాన్ని చట్టబద్ధం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రైట్ టు బ్రైబ్ (లంచం తీసుకునే హక్కు)ను ప్రభుత్వంలోని అధికారులకు కల్పించాలన్నారు. బీహార్లో అవినీతి రోజురోజుకీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
లంచాన్ని ఇప్పుడు దొంగచాటుగా తీసుకుంటున్నారని, చట్టబద్ధత కల్పిస్తే ఉద్యోగులు ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా దర్జాగా తీసుకోవచ్చన్నారు. బీహార్లోని తమ (జేడీయూ) ప్రభుత్వం అవినీతిని అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని, ఈ విషయంలో ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేయడంతో మనస్తాపం చెంది ఈ డిమాండ్ చేస్తున్నానన్నారు. లంచానికి చట్టబద్ధత కల్పించేందుకు తాను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేటు బిల్లును కూడా ప్రతిపాదించనున్నానన్నారు.
సొంత పార్టీ సభ్యుడే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తడంతో బీహార్ లోని జితాన్ రామ్ మంజీ సర్కార్ సంకటంలో పడింది. రాజీవ్ రంజన్ వ్యాఖ్యలకు ప్రతిపక్ష బీజేపీ మద్దతు పలికింది. సొంత పార్టీ సభ్యుడే ప్రభుత్వాన్ని తప్పుపట్టడం జేడీయూ సర్కార్ పని తీరు ఎంత ఘోరంగా ఉందో తెలియజేస్తోందని బీజేపీ అంటోంది. మరోవైపు, సొంత సర్కార్పై విమర్శలు గుప్పించిన రాజీవ్ రంజన్పై క్రమశిక్షణ చర్యలు తీసుకువాలని జెడియు సర్కార్ భావిస్తోంది.