ప్రియాంకకోసం పదవి ఖాళీలేదు: థరూర్, రాజ్నాథ్ క్లాస్
న్యూఢిల్లీ: కేంద్రమంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత శశి థరూర్ ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తనయ ప్రియాంక గాంధీ విషయమై ఆయన మాట్లాడారు. ప్రియాంకా గాంధీకి కాంగ్రెస్లో నాయకత్వ పదవి ఖాళీగా లేదని చెప్పారు.
ప్రియాంక, ఆమె భర్త వాద్రా కాంగ్రెస్లో కీలక బాధ్యతలు నిర్వహించనున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో శశి థరూర్ మాట్లాడారు. కాంగ్రెస్కు అధ్యక్షురాలు, ఉపాధ్యక్షులు ఉన్నారన్నారు. వారు చాలా ఉత్సాహంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారన్నారు.
గిరిరాజ్కు రాజ్నాథ్ క్లాస్
బీహార్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత గిరిరాజ్ సింగ్ శనివారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీ అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్ ఆయనకు క్లాస్ పీకారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలన్నారు.
కాగా, గిరిరాజ్ సింగ్ తన వ్యాఖ్యలతో శనివారం అగ్గి రాజేశారు. మోడీని వ్యతిరేకించే వారు ఎన్నికల ఫలితాల అనంతరం పాకిస్థాన్కు వెళ్లాల్సి ఉంటుందని, అటువంటి వారికి దేశంలో చోటు లేదన్నారు. జార్ఖండ్లోని గోడా జిల్లాలో జరిగిన సభలో గిరిరాజ్ మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
వీటిపై విమర్శలు రావడంతో బిజెపి ఆయన వ్యాఖ్యలను ఖండించింది. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమని, వాటిని తాము ఆమోదించేది లేదని బిజెపి అధికార ప్రతినిధి నిర్మలా సీతారామన్ అన్నారు. తమ ప్రధాని అభ్యర్థి మోడీ సానుకూల ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారని ఆమె చెప్పారు.