గాలి జనార్ధన్ రెడ్డి: 'కృష్ణం వందే జగద్గురుమ్'
ఈ చిత్రంలో రెడ్డప్ప మైనింగ్ సామ్రాట్. ఐతే ఇతను అసలు రెడ్డప్ప కాదు. తన స్నేహితుడు అయిన రెడ్డప్పను మోసగించి ఆయన స్థానంలో పైకెదుగుతాడు. ఇతని అసలు పేరు చక్రవర్తి. తన స్థానంలో(చక్రవర్తి) స్నేహితుడి(రెడ్డప్ప)ను అరెస్టు కూడా చేయిస్తాడు. ఈ చక్రవర్తి కథానాయకుడు రాణా మేనమామ. ఇతను మైనింగ్ చేసి లక్ష కోట్లు సంపాదిస్తారు. ఈ సినిమాలో పలుమార్లు మైనింగ్ చేసి లక్ష కోట్లు సంపాదించాడనే వ్యాఖ్య వినిపిస్తుంది.
హీరోకు బళ్లారి బాబు అని పేరు పెట్టారు. మైనింగ్తో లక్ష కోట్ల సంపాదన, బళ్లారి బాబు ఇవన్నీ గాలి జనార్ధన్ రెడ్డిని గుర్తుకు తెస్తున్నాయి. గాలి జనార్ధన్ రెడ్డి ఓఎంసి, ఏఎంసిని స్థాపించి అక్రమ మైనింగ్తో భారీగా సంపాదించారనే ఆరోపణలతో అరెస్టై జైలులో ఉన్న విషయం తెలిసిందే. గాలి జనార్ధన్ రెడ్డి రాజకీయ నాయకుడిగానే కాకుండా మైనింగ్ సామ్రాట్గానే బాగా పాపులర్ అయ్యారు. దీంతో ఇప్పుడు వచ్చిన కృష్ణం వందే జగద్గురుమ్ సినిమా మైనింగ్ పైన ఉండటంతో ఆయనను గుర్తుకు తెస్తోంది.
మరో విషయమేమంటే గాలి మైనింగ్ కోసం అనంతపురం జిల్లాలో చారిత్రక చెంచులమ్మ గుడిని పునాదులతో సహా కూలగొట్టి, ఆనవాలు కనిపించకుండా చేశారనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. దీనిపై స్థానికుల నుండి, రాజకీయ పార్టీల నుండి భారీగా విమర్శలు వచ్చాయి. సినిమాలో కూడా రెడ్డప్ప గుడి ఆనవాళ్లు లేకుండా చేశాడని, మైనింగ్తో అంతా పొల్యూషన్ చేసి స్థానికులకు బతకడానికి వీలులేకుండా చేశాడనే పాయింట్ ఉంది. ఇదంతా గాలిని గుర్తుకు తెస్తోంది.
అయితే దర్శకుడు ఓ మంచి పాయింట్ తీసుకొని చాలామంచి సినిమా తీశారు. అయితే ఈ సినిమా చూస్తే గాలి జనార్ధన్ రెడ్డి గుర్తుకు వచ్చినంత మాత్రాన ఆయనే లక్ష్యంగా సినిమాను తీశాడని చెప్పడానికి వీలులేదంటున్నారు. కాగా సినిమాలో రెడ్డప్ప పాత్ర గాలి జనార్థన్రెడ్డిని పోలి ఉందని అంటునే కామెంట్స్ వినిపిస్తున్న నేపధ్యంలో దర్శకుడు క్రిష్ వివరణ కూడా ఇచ్చారు. తాను ఏ ఒక్కరినో లక్ష్యంగా చేసుకొని ఈ సినిమా తీయలేదని, జాతీయ సంపద దోచుకెళ్లే వారి గురించి సినిమా తీశానని, మట్టిని మెక్కేస్తోంటే.. గుడ్లప్పగించి చూస్తున్న బీటెక్ బాబుల గురించి ఈ సినిమా తీశాను అన్నారు.
'కృష్ణం వందే జగద్గురుమ్'లో మైనింగ్ మాఫియా సమస్యకు నాటకం, జీవితం, భాగవతంతో అందమైన ముడివేశాడు. నాటక సమాజం, మైనింగ్ మాఫియా, భగవద్గీత సారాంశం వీటన్నింటినీ ఒకే కథలో మేళవించారు. ఈ చిత్రంలో కథానాయిక నయనతార చెప్పే ఓ డైలాగ్కు థియేటర్లో చప్పట్ల వర్షం కురుస్తోంది. మొదట రానా ఇతరుల సమస్యల్ని పట్టించుకోడు. నయన తార జర్నలిస్ట్. ఓ సందర్భంలో ఆమె... తొమ్మిది నెలలు మోసి పురిటి నొప్పులతో బాధపడితే పిల్లలు పుడతారని కొందరు భావిస్తే... పది నిమిషాలు పడుకుంటే పుడతారని కొందరు భావిస్తారు. అయితే పురిటి నొప్పులతో అని భావించే వారు మనుషులు అవుతారు. పది నిమిషాలు అని భావించే వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారనే అంటుంది.