కొత్త రాజధాని: బాబు, ఆలోచిస్తానని బిజెపిపై ఘాటుగా..
విజయనగరం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గురువారం విజయనగరం జిల్లాలో పర్యటించారు. పలు ప్రాంతాల్లో ఆయన మాట్లాడారు. సీమాంధ్ర పునర్నిర్మాణం కోసం తాను కూలీనై పని చేస్తానన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కొత్తగా రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. అవకాశమిస్తే అభివృద్ది అంటే ఏమిటో చేసి చూపిస్తానన్నారు.
తానెప్పుడూ నిప్పులా ఉంటూ నిజాయితీగా ప్రజలకు సేవలందించానని, అందుకే కాంగ్రెస్ పార్టీ తనపై 25 సార్లు విచారణ జరిపించి ఏమీ చేయలేకపోయిందన్నారు. మొద్దాబ్బాయి రాహుల్ గాంధీ, దొంగబ్బాయ్ జగన్తో ఒప్పందాలు కుదుర్చుకుని, రాజయకీయ లబ్ధికోసం రాష్ట్ర విభజనకు గోతులు తీసిన కాంగ్రెస్ పాలకులు అదే గోతిలో పడ్డారన్నారు.
ఆడబిడ్డలను ఆదుకునేందుకు వారికి సెల్ఫోన్లు ఇస్తామన్నారు. ఆపదలో ఉన్నప్పుడు నెం-9 నొక్కితే నిమిషాల్లో అక్కడకు పోలీసులు వచ్చి వారికి న్యాయం చేసే విధంగా చేస్తారన్నారు. కష్టాల్లో ఉన్న రైతులకు రుణమాఫీ చేసి పంట రుణాలందించేందుకు కృషిచేస్తామన్నారు.
బిజెపి పొత్తుపై స్పందిస్తూ... పొత్తులో భాగంగా సీమాంధ్రలో బిజెపికి కేటాయించిన స్థానాల్లో ఆ పార్టీ బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టడం వల్ల కొన్ని లోకసభ, అసెంబ్లీ స్థానాలు చేజార్చుకునే పరిస్థితి ఏర్పడిందని, దీనిపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు.
విజయనగరం జిల్లా గజపతినగరంలో గురువారం రాత్రి జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ బిజెపితో పొత్తు కుదుర్చుకున్నప్పటికీ, అన్ని స్థానాల్లోనూ ఆ పార్టీ బలహీనమైన అభ్యర్థులను బరిలో దించడం వల్ల ప్రత్యర్థి పార్టీలు లాభపడి, టిడిపి ఎక్కువగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఇరుపార్టీల మధ్య పొత్తులో భాగంగా సీమాంధ్రలో బిజెపికి 4 పార్లమెంట్ స్థానాలు, 14 అసెంబ్లీ స్థానాలను కేటాయించిన విషయం తెలిసిందే. నామినేషన్ వేసేందుకు మరొక్క రోజు గడువు మాత్రమే ఉన్న పరిస్థితుల్లో పొత్తుపై పునరాలోచన చేయాలని చంద్రబాబు పేర్కొనడం ఆసక్తిని కలిగిస్తోంది.